రియాద్: సౌదీ అరేబియాలో రానున్న మూడు రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) హెచ్చరించింది.
మక్కా, మదీనా ప్రాంతాల్లోని పలు ప్రాంతాలతో పాటు తూర్పు ప్రావిన్స్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లవద్దని, తగినంత నీరు తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండల తీవ్రత కొనసాగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో కావాలని ప్రజలకు సూచించింది.

