బంగాళాఖాతం నైరుతి దిశలో గాలి మళ్లింపు కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 11 లేదా 12 తేదీల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ద్రోణి వల్ల ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆకస్మికంగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాకుండా గాలి వేగం కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
ఆందోళనలో అన్నదాతలు
అకాల వర్షాలు రైతులను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. కోతకు వచ్చిన పంటలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం ఆరబోసిన కల్లాల్లోకి నీరు చేరడంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు.

