చెన్నై: షార్జా నుండి చెన్నై చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. విమానం ల్యాండ్ అయి రన్వే నుంచి పార్కింగ్ ఏరియాకు కదులుతున్న సమయంలో, పుదుక్కోట్టైకి చెందిన ఒక ప్రయాణికుడు ఊహించని విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరిచి బయటకు దూకేశాడు.
ఈ చర్యను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తం చేయడంతో CISF సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వెల్లడైంది. ప్రయాణంలో రెండు సార్లు వాంతులు చేసుకున్న అతడు, విమానం ఆగిన వెంటనే బయటపడటానికి కంగారులో డోర్ తెరిచి దూకేసినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఈ ఘటన కారణంగా భద్రతా కారణ దృష్ట్యా ప్రధాన రన్వేను ఒక గంట పాటు మూసివేసి, విమానాలను ప్రత్యామ్నాయ రన్వేకు మళ్లించారు.

