Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

KTR: ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం..!

MAHAA News 2 days ago

KTR: రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం అబద్ధాలు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి తన పాలనను నెట్టుకొస్తున్నారని విమర్శించారు.

కొడంగల్‌లోనూ రైతుల నిరసనలు..

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్నారని, చివరకు సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కూడా రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. మార్కెట్లలో కనీసం గన్నీ బ్యాగులు (గోనె సంచులు) కూడా దొరకడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ఐపికే కేంద్రాల్లో 10 మంది రైతులు మృతి..

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల (ఐపికే) వద్ద పడిగాపులు కాస్తూ ఇప్పటివరకు 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా.. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా చనిపోలేదని మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అత్యంత శోచనీయమని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతుల ప్రాణాలు పోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు 35 శాతం కూడా కొనలేదు!

సీజన్ ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం 35 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేకపోయిందని కేటీఆర్ లెక్కలతో సహా విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంలో, రైతులకు సకాలంలో గన్నీ బ్యాగులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి, తక్షణమే పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించి అన్నదాతలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News