Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nepal Floods: ఒకే ఇంట్లో 23 మృతదేహాలు.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య..!

MAHAA News 1 week ago

Nepal Floods: నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదల విషాదం రోజురోజుకూ మరింత భయానక రూపం దాలుస్తోంది. గత వారం ప్రారంభమైన ఈ జల ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1000కి పైగా చేరుకుంది (నేపాల్‌లో దాదాపు 987, టిబెట్ పరిధిలో 16 మంది).

వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో హిమాలయ లోయల్లో ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. భారీ వర్షాలు, మోకాళ్ల లోతు బురద, కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన వంతెనల నడుమ సుమారు 22 వేల మందికి పైగా సైనిక, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు - యూపీ నదిలో తేలిన శవాలు..

నువాకోట్ జిల్లా బెత్రావతిలోని ఒకే ఇంట్లో ఏకంగా 23 మృతదేహాలు లభ్యమవడం అందరినీ కలచివేసింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ చోట తలదాచుకుని వీరంతా సజీవ సమాధి అయ్యారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

నేపాల్ వరద ఉధృతికి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ సమీప గండక్ నదిలో తేలాయి. వీటిని గుర్తించి నేపాల్ అధికారులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది.

సొరంగాల్లో చిక్కుకున్న 900 మందికి పైగా కార్మికులు..

వరదల ధాటికి నేపాల్ విద్యుత్ వ్యవస్థ 10 శాతం నిలిచిపోయింది. రసువా, నువాకోట్ జిల్లాల్లోని దాదాపు 11 జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 894 నుంచి 930 మంది కార్మికులు గల్లంతయ్యారు. త్రిశూలీ-3ఏ ప్రాజెక్టులో 40 మందికి పైగా ఇంజనీర్లు, త్రిశూలీ-3బీ ప్రాజెక్టులో 118 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. బురదతో పూర్తిగా మూసుకుపోయిన సొరంగాలను తెరిచేందుకు భారత, చైనా టన్నెల్ నిపుణులు, ఆర్మీ ప్రత్యేక పరికరాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మృతదేహాల గుర్తింపు కష్టతరం - సామూహిక ఖననం..

మార్చురీల్లో సరిపడా స్థలం లేకపోవడం, మృతదేహాలు తీవ్రంగా దెబ్బతినడంతో టాటూలు, దుస్తులు, డీఎన్‌ఏ (DNA) నమూనాల ఆధారంగా గుర్తిస్తున్నారు. భారత్‌కు చెందిన 18 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఈ ప్రక్రియలో సహాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించని వందలాది మృతదేహాలకు అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం డీఎన్‌ఏ భద్రపరిచి సామూహిక ఖననం చేస్తున్నారు.

65 వేల మందికి అత్యవసర సాయం..

ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 11,800 మందిని సురక్షితంగా తరలించారు. అయితే సుమారు 39 దేశాలకు చెందిన 580 మందికి పైగా విదేశీయులు ఇంకా గల్లంతై ఉన్నట్లు సమాచారం. సుమారు 65 వేల మందికి తక్షణ తాగునీరు, ఆహారం, మందులు అవసరమని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరించింది. భారత్, చైనా, సింగపూర్ సహా పలు దేశాలు రెస్క్యూ కిట్లు, ఆహార సామగ్రితో సహాయం అందిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News