Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Supreme Court: 'పట్టుకోవడం-వదిలేయడం' కుదరదు.. షెల్టర్లకే పరిమితం చేయాలి!

MAHAA News 5 days ago

Supreme Court: దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న వీధి కుక్కల దాడుల (Stray Dog Menace) సమస్యపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది.

ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లు మరియు బస్టాండ్ల వంటి ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో తామిచ్చిన చారిత్రాత్మక ఆదేశాలను సవరించడానికి నిరాకరించిన కోర్టు.. క్షేత్రస్థాయిలోని “కఠినమైన వాస్తవాలను చూస్తూ తాము గుడ్డిగా ఉండలేము” అని ప్రభుత్వాలకు కడిగిపారేసింది.

'పట్టుకోవడం-వదిలేయడం' కుదరదు.. షెల్టర్లకే పరిమితం చేయాలి!

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని, జంతు సంరక్షణ చట్టాల ప్రకారం కుక్కలను మళ్లీ అదే ప్రాంతాల్లో వదిలేయడానికి అనుమతించాలని దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనల పరిధిలోని 'క్యాప్చర్-స్టెరిలైజ్-వాక్సినేట్-రిలీజ్' (CSVR) మోడల్‌ను రద్దీ ప్రాంతాలలో కోర్టు సస్పెండ్ చేసింది.

దీని ప్రకారం.. స్కూళ్లు, హాస్పిటల్స్, ఎయిర్‌పోర్టుల వంటి చోట్ల కుక్కలను పట్టుకుని, వాటికి ఆపరేషన్ చేసి, టీకాలు వేసిన తర్వాత మళ్లీ అదే ప్రాంతాల్లో వదిలిపెట్టడానికి వీల్లేదు. వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక షెల్టర్ హోమ్‌లకే (ఆశ్రయ కేంద్రాలు) తరలించి, అక్కడే ఉంచాలని ఆదేశాలను పునరుద్ధరించింది.

డార్విన్ సిద్ధాంతం నడుస్తోంది.. పిల్లలు, వృద్ధుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది?

దేశంలో వీధి కుక్కల దాడులు నిత్యకృత్యంగా మారడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే “డార్విన్ సిద్ధాంతం (బలవంతుడిదే మనుగడ)” నడుస్తున్నట్లు కనిపిస్తోందని, బలహీన వర్గాలైన చిన్న పిల్లలు, వృద్ధులను కుక్కల దాడుల నుండి కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడింది. చిన్న పిల్లలు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతుంటే, విదేశీ పర్యాటకులు సైతం దేశంలో దాడులకు గురవుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆర్టికల్ 21 ప్రకారం.. భయం లేకుండా తిరిగే హక్కు పౌరుడిది!

ఈ తీర్పులో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఉటంకించింది.

బహిరంగ ప్రదేశాల్లో కుక్క కాట్లు తింటామనే నిరంతర భయం లేకుండా, తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఆందోళన లేకుండా ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తిరిగే హక్కును కలిగి ఉన్నాడు. ఇది ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుంది” అని కోర్టు స్పష్టం చేసింది.

మానవ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నప్పుడు, వాటిని అరికట్టడానికి చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కేవలం ఒక ‘మూగప్రేక్షకుడిగా’ (Passive Spectator) మిగిలిపోకూడదని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది.

అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తథ్యం!

కుక్క కాట్ల సమస్య ఇప్పుడు నివాస ప్రాంతాల నుండి ఎయిర్‌పోర్టుల వరకు పాకిందని, సంఘటనలు పదేపదే పునరావృతం కావడం స్థానిక మున్సిపల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వ ధోరణికి నిదర్శనమని కోర్టు ఎత్తిచూపింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, బాధ్యులైన ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ (Contempt of Court) తో పాటు కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News