ఢిల్లీ : భారత్ లో టీకాల డ్రైవ్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 45కోట్ల మందికి పైగా టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 18-44 వయస్సు వారిలో 15.38కోట్లకుపైగా డోసులు వేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఒకే రోజు 39,42,457 మందికి టీకాలు వేసినట్టు వారు పేర్కొన్నారు. ఇందులో 18-44 ఏళ్లలోపు వారికి 20,54,874 మొదటి, 3,00,099 రెండో డోసు టీకాలు వేసినట్టు వారు చెప్పారు. మూడో విడుత టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి 18-44 వయసు ఉన్నవారు 14,66,22,393 మందికి మొదటి, 71,92,485 మంది రెండో డోసు టీకా వేశామని అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కోటికిపైగా డోసు టీకాలు వేసినట్టు వారు తెలిపారు. బుధవారం నాటికి టీకా డ్రైవ్ 194వ రోజుకు చేరిందని, ఒకే రోజు 39,42,457 టీకాలు వేయగా, 27,41,794 మందికి మొదటి, మరో 12,00,663 మందికి రెండో డోసు టీకాలు వేశామని అధికారులు స్పష్టం చేశారు.

