వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. చర్చల అంశాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తున్నందున ఆ దేశంపై భీకర దాడులు విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.
"ప్రస్తుతం మేం వారితో చర్చలు జరుపుతున్నాం. చర్చలను వారు సీరియస్గా తీసుకుంటున్నారు. అందుకు కారణం ఉండొచ్చు. వారు లొంగిపోవచ్చు. లేదా ఏదైనా గుహ లోకి వెళ్లి దాక్కోవచ్చు. మా వైపు నుంచి క్షిపణులు లోడ్ చేసే ఉన్నాయి. యుద్ధం ముగించడానికి రెండు అవకాశాలున్నాయి. ఇప్పుడు చేస్తోన్న దాడుల తీవ్రత పెంచి, వాళ్ల దగ్గర ఉన్నదంతా నాశనం చేయొచ్చు. లేకపోతే ఒప్పందం చేసుకోవచ్చు. డీల్ చేసుకోవడమనేది తెలివైన వ్యూహం. చర్చల విషయంలోవారు సీరియస్గా ఉన్నంత మాత్రాన ఒప్పందం కుదురుతుందని చెప్పలేం. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి" అని పేర్కొన్నారు.
కాగా.. ఇరాన్పై భీకర దాడుల్ని పరిశీలిస్తున్నామని, దానిపై నిర్ణయం తీసుకుంటామని ముందురోజు ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఇరాన్ నుంచి కౌంటర్ వచ్చింది. అమెరికా బెదిరింపులకు తలొగ్గబోమని, బలప్రయోగం , ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్కు ఆయుధాలు అమ్మవద్దని చైనా,రష్యాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

