పాకిస్థాన్ వేదికగా ఇరాన్ అమెరికా తదుపరి చర్చలు ఈ నెల 11వ తేదీన జరుగుతాయి. ఈసారి జరిగే చర్చలు ఇంతకు ముందు కుదిరిన ప్రాధమిక రాజీ అవగావహన ఒప్పందం అమలు సాంకేతిక విషయాలపై జరుగుతాయి.
కీలక మధ్యవర్తిత్వ పాత్రలో ఉన్న పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఈ దఫా చర్చలు ఉంటాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ మీడియా ఆదివారం తమ కథనాలలో తెలిపింది. గత నెల 18వ తేదీన అమెరికా ఇరాన్ మధ్య శాంతిపునరుద్ధరణ ఒప్పందం ఎంఒయుపై పారిస్ వేదికగా సంతకాలు జరిగాయి. తరువాతి క్రమంలో ఇరుదేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతూ ఉన్నా, మధ్యమధ్యలో దోహాలో అసంపూర్తి చర్చలు ముగిశాయి. పాకిస్థాన్ పట్టుదలతో వ్యవహరించడంతో తిరిగి అత్యంత కీలకమైన చర్చలు ఇస్లామాబాద్లో జరిగేందుకు ఏర్పాట్లు జరిగాయని దౌత్యవర్గాల సమాచారం మేరకు డాన్ పత్రిక తెలిపింది.
తదుపరి కీలక చర్చలు ఇస్లామాబాద్లో కానీ స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో కానీ ఏర్పాటు చేయాలని మధ్యవర్తి దేశాలు అనుకుంటున్నాయి. అయితే పలు కారణాలతో చర్చలకు అనువైన వేదికగా ఇస్లామాబాద్ను ఎంచుకుంటారని పత్రిక తమ విశ్లేషణలో తెలిపింది. చర్చలకు తేదీ ఇప్పటికే ఖరారు అయింది. అయితే వేదిక గురించి కొంత సందిగ్ధత ఉందని దౌత్యవర్గాలు తెలిపాయి. హర్మూజ్ జలసంధి మీదుగా నౌకా రవాణా, లెబనాన్లో కాల్పుల విరమణ , ప్రాంతీయ భద్రతా అంశాలు ఈ దఫా చర్చలలో ప్రస్తావనకు వస్తాయి. అయితే అత్యంత కీలకమైన ఇరాన్ అణు కార్యక్రమ అంశం, విదేశాలలో స్తంభించిపోయి ఉన్న ఇరాన్ ఆస్తుల విషయాలు, ఆంక్షల ఎత్తివేత వంటివి ప్రధానంగా చర్చకు రానున్నాయి.

