హైదరాబాద్: తెలంగాణ విస్తరిస్తామని ఎపి మంత్రి లోకేష్ అంటున్నారని, ఇదేమీ సామ్రాజ్యం కాదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలిపారు. తెలంగాణలో నవనిర్మాణం పేరుతో డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సభ పెడతారట అని అన్నారు.
ఎపి నేతలపై కవిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలతో తెలంగాణపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని, 13 ఏళ్లయినా ఎపిలో కనీసం రాజధాని కట్టుకోలేదని విమర్శించారు. ఎపి, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకోనేది లేదని కవిత హెచ్చరించారు. వర్షాకాలంలో సచివాలయంలోకి నీరు రాకుండా పవన్, లోకేష్ చూసుకోవాలని, సిఎం ఎపి ఏజెంట్.. అందుకే ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని మండిపడ్డారు.. అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలు అన్నీ కూలగొడతామని సూచించారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఆంధ్రావాళ్లంతా తమవారేనని, ఆంధ్రావాళ్లను 12 ఏళ్లు కడుపున పెట్టి కాపాడుకున్నామని, ఇకపై కూడా హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లను కాపాడుకుంటామని తెలియజేశారు. ఇక్కడకు రావచ్చు..పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, షూటింగ్ లు చేసుకుని పోవచ్చునని, ఎపి నేతలు తమ సచివాలయంలో గరిటె తిప్పుతామంటే కుదరదు అని కవిత హెచ్చరించారు.

