మన తెలంగాణ/హైదరాబాద్ః నిషేధిత భూముల (ఏ) భాగోతంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరిట హైదరాబాద్ పరిసరాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కాజేసేందుకు కొత్త దందా మొదలుపెట్టారని ఏలేటి ఆదివారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అసెంబ్లీలో కాంగ్రెస్-బిఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెర లేపారని ఆయన విమర్శించారు. రూ.33 వేల కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం వాటిని ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
గత ఆరు రోజులుగా జరిగిన శాసనసభ సమావేశాలు సాగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను నిలదీస్తున్న తమ గొంతు నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తాము బాధ్యతాయుతంగా అవినీతి, భూ అక్రమాలపై గళమెత్తుతుంటే మంత్రులు మైకులు కట్ చేయిస్తూ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
మొదటి మూడు రోజుల పాటు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఒకరినొకరు దూషించుకుంటూ ఉద్దేశపూర్వకంగా సభ సమయాన్ని వృథా చేశాయని, చివరి రోజున 22ఏ నిషేధిత జాబితాపై చర్చ పేరుతో సంబంధిత మంత్రి ఏకంగా నాలుగు గంటల పాటు మతిభ్రమించినట్లు మాట్లాడారే తప్ప 50 లక్షల మంది రైతులు, పేద వర్గాలకు సంబంధించిన సమస్య పరిష్కారానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 22ఏ సెక్షన్లను కోర్టు నిర్ణయించిందని మంత్రి చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆయద విమర్శించారు. చట్టాలు చేసేది చట్టసభలు, జీవోలు ఇచ్చేది ప్రభుత్వమే తప్ప కోర్టులు కావని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

