హైదరాబాద్: హాస్టళ్లలో అవినీతి జరిగిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బిఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు అని అన్నారు. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న బిఆర్ఎస్ నేతల ఆరోపణలపై గన్ పార్క్ కు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ మంత్రులు చర్చకు సిద్ధమయ్యారు. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు కూర్చున్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్ లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ..తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని..ప్రజలందరికీ నిజం తెలియాలని, బిఆర్ఎస్ ప్రజాపతినిధులు ఎవరు వచ్చిన తాము చర్చకు సిద్ధమన్నారని సవాల్ విసిరారు. మొత్తం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరిపామని, నాలుగు శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్లు పిలిచామని తెలియజేశారు.
టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చనే అనే విషయం తెలియిదా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఎస్సి, ఎస్టి,బిసి, మైనార్టీ పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారని, ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని కోరుతున్నామని అన్నారు. పదేళ్లుగా బిఆర్ఎస్ చేసిన ప్రొక్యూర్ మెంట్ చర్చకు సిద్ధం అని అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరో, ఏదో తప్పుడు సమాచారం ఇస్తే దానిపై మాట్లాడవద్దు అని సూచించారు. తమ దగ్గర రికార్డులన్నీ ఉన్నాయని..చెప్పేందుకు సిద్ధం అని చర్చల కోసం తమ పార్టీ కార్యాలయానికి బిఆర్ఎస్ ను పిలవడం లేదని అన్నారు. బిఆర్ఎస్ వద్ద ఏమైనా ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేస్తున్నామని, తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తామని అన్నారు. తాడు బొంగరం లేనివాళ్లతో చర్చించం..ఎమ్మెల్యేలే రావాలని, హాస్టల్ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని..వారి సంక్షేమం కాంగ్రెస్ బాధ్యత అని చెప్పారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం..జాగ్రత్త అని హెచ్చరించారు. అసెంబ్లీ చర్చకు రావాలని మాజీ సిఎం కెసిఆర్ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

