హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ అభివృద్ధి పథంలో మరో చారిత్రాత్మక అడుగు పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మన హుస్నాబాద్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచేలా తెలంగాణలోనే తొలి గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని ప్రశంసించారు.
రూ.18 కోట్ల వ్యయంతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించబడనున్న ఈ అద్భుత గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటక రంగానికి కొత్త ఊపును తీసుకురానుందన్నారు. ఆధునిక సౌకర్యాలు, అందమైన వాతావరణంతో హుస్నాబాద్ను మరింత ఆకర్షణీయమైన పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు అని పొన్నం కొనియాడారు. ప్రజలకు వినోదంతో పాటు పట్టణానికి కొత్త ప్రతిష్టను తీసుకురాబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. హుస్నాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

