పిఎంజె జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఐదుగురు సాయుధ దుండగులు
సిబ్బంది ఒకరు మృతి..
ఉలిక్కిపడిన కరీంనగర్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
నగరంలోని పిఎంజె జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఐదుగురు సాయుధ దుండగులు సిబ్బందిపై విచ్చక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది.
సిబ్బంది ఒకరు మృతి..
అందిన సమాచారం ప్రకారం ఆదివారం రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు పిఎంజె జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిబ్బంది ఒకరు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాపులోని సిసి టివి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఉలిక్కిపడిన నగరం..
క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టపగలు, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్ లో పెను సంచలనం సృష్టించింది. దోచుకెళ్లిన నగలు ఎంత మొత్తంలో ఉంటాయనేది అధికారులు ఇంకా నిర్దారించాల్సి ఉంటుంది.

