గతేడాదితో పోలిస్తే 65 శాతం క్షీణత
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో నిరాశపర్చింది.
కంపెనీ నికర లాభం రూ.475 కోట్లతో 65.3 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,371 కోట్లుగా ఉంది. ఇక త్రైమాసిక ప్రతిపాదికన చూస్తే లాభం 7.8 శాతం పెరిగింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.440 కోట్లుగా ఉంది. ఎక్సేంజ్ ఫైలింగ్లో మారుతీ సుజుకీ పేర్కొన్న ప్రకారం, స్టీలు, అల్యూమినియం వంటి విలువైన మెటల్స్ ధరలు ఒక్క ఏడాదిలోనే అనూహ్యంగా పెరిగాయి. ఖర్చులను తగ్గించడం ద్వారా ధరలను నియంత్రణలో ఉంచడానికి కంపెనీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ సాధ్యం కాకపోవడం ఈ భారంగా వినియోగదారులపై మోపాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. మారుతీ సుజుకీ ఆదాయం రూ.18,744 కోట్ల నుంచి రూ.20,538 కోట్లకు పెరిగింది. ఇక జూన్ ముగింపు నాటి త్రైమాసికంలో ఆదాయం రూ.17,770 కోట్లుగా ఉంది.
పెరిగిన విక్రయాలు
కంపెనీ నికర విక్రయాలు గతేడాదిలో రూ.17,689 కోట్ల నుంచి ఈసారి రూ.19,297 కోట్లకు పెరిగాయి. ఎలక్ట్రానికి పరికరాల సరఫరాలో అంతర్జాతీయ కొరత వల్ల రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం 3,79,541 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా అమ్మకాలు చూస్తే 3,20,133 యూనిట్లు నమోదయ్యాయ. ఎగుమతుల విషయానికొస్తే 59,408 యూనిట్లు నమోదవగా, ఇటీవల ఏ త్రైమాసికంలో ఇంతలా ఎగుమతులు లేవు. గతేడాది(2020) ఇదే సమయంలో కంపెనీ మొత్తం విక్రయాలు 3,93,130 కోట్లు నమోదవగా, గతేడాది దేశంగా 3,70,619 యూనిట్లు, ఎగుమతి మార్కెట్ పరంగా 22,511 యూనిట్లు నమోదైనాయి.
2 లక్షల పెండింగ్ ఆర్డర్లు
దేశీయంగా కార్ల తయారీకి ఎలక్ట్రానిక్ పరికరాల కొరత ఎక్కువగా ఉంది. దీంతో సంస్థ అంచనా వేసిన 1,16,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. సెప్టెంబర్ ముగింపు నాటి దాదాపు 2 లక్షల పెండింగ్ కస్టమర్ ఆర్డర్లు ఉన్నాయి. డెలివరీలను వేగవంతం చేసేందుకు కంపెనీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ఎబిటా రూ.1,933 కోట్ల నుంచి రూ.854 కోట్లకు అంభ 55.8 శాతం పడిపోయాయి. ఎబిటా మార్జిన్ కూడా 10.3 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోయింది.
Maruti suzuki Q2 net profit dives 65% to Rs 475 cr

