Dailyhunt
నేతాజీ అడుగు జాడల్లోనే నడుస్తున్నాం: ప్రధాని మోడీ

నేతాజీ అడుగు జాడల్లోనే నడుస్తున్నాం: ప్రధాని మోడీ

నేతాజీ అడుగు జాడల్లోనే నడుస్తున్నాం
దేశానికి బెంగాల్ అమూల్య సంపదనిచ్చింది
విక్టోరియా మెమోరియల్ సభలో ప్రధాని మోడీ

కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్వాతంత్య్ర సంగ్రామానికి కొత్త దిశనిచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరినీ నేతాజీ ఉత్తేజపరిచారన్నారు. ఆయన దేశం కోసం చేసిన సేవ, త్యాగాన్ని గుర్తుంచుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం అని మోడీ ఉద్భోదించారు. నేటి భారత దేశాన్ని చూస్తే నేతాజీ చాలా గర్వపడే వారని, ఎల్‌ఏసినుంచి ఎల్‌ఓసి దాకా భారత పరాక్రమాన్ని, భారత విశ్వరూపాన్ని ప్రపంచమంతా చూస్తోందని మోడీ పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మహిళల ప్రాథమిక హక్కుల కోసం పరితపిస్తున్న వేళ నేతాజీ ఏకంగా రాణీఝాన్సీ పేరిట ఓ దళాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్య్ర పోరాటాన్ని అనుసంధానించారని, వారందరికీ శిక్షణ ఇచ్చి దేశ సంగ్రామంలో పాల్గొనేలా చేశారని ప్రధాని కొనియాడారు.

నేతాజీ 125వ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాలులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ, 'నేతాజీ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళ్తోంది. ఆయన చేసిన కృషిని తరతరాల వారు గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా నేతాజీకి శిరసు వంచి నమస్కరిస్తున్నా. ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీని 'పరాక్రమ్ దివస్'గా జరుపు కోవాలని నిర్ణయించాం' అని అన్నారు. భారత దేశం ఒక నూతన, బలమైన దేశంగా రూపు దిద్దుకోవడం చూసి ఉంటే నేతాజీ ఎలా ఫీలయ్యేవారని నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను' అని కూడా ప్రధాని అన్నారు. దేశానికి బెంగాల్ జాతీయ గీతంతో పాటుగా అన్ని రంగాల్లో వెలకట్టలేని సంపదను ఇచ్చిందన్నారు. దేశంతో పాటుగా బెంగాల్‌ను 'సోనార్ బంగ్లా'గా తీర్చి దిద్దుకోవలసిన అవసం ఉందన్నారు.
నేతాజీ పూర్వీకుల నివాసం సందర్శన
నేతాజీ 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ప్రధాని కోల్‌కతాలోని భవానీ పూర్‌లో ఉన్న ఆయన పూర్వీకుల నివాసాన్ని సందర్శించారు. ప్రధాని నేతాజీ భవన్‌కు రాగానే అక్కడ బైట వేచి ఉన్న జనం ' జైశ్రీరాం' నినాదాలతో ఆయనకు స్వాగతం పలికారు. నివాసం ముఖద్వారం వద్ద ప్రధానికి నేతాజీ మునిమనవళ్లు సుగతో బోస్, సుమంత్రో బోస్‌లు స్వాగతం పలికారు. ఆయనకు నేతాజీ కోల్‌కతానుంచి గోమోకు తప్పించుకోవడానికి ఉపయోగించిన 'వాండరర్' కారునుచూపించినట్లు సుగతో బోస్ చెప్పారు. ప్రధానికి నేతాజీ బెడ్‌రూమ్‌లను కూడా వారు చూపించారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సంబంధించిన ఫోటోలున్న మ్యూజియంను కూడా ప్రధాని కలయదిరిగి చూశారు. సింగపూర్‌లో నేపాల్ ఉపయోగించిన టేబుల్‌ను కూడా వారు మోడీకి చూపించారు. రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ కూడా ప్రధాని వెంట ఉన్నారు.

PM Modi address at Victoria Memorial

PM Modi address at Victoria Memorial

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu