సంగారెడ్డి: ఒకప్పుడు మెదక్ కరువు జిల్లా అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో మరో రెండు ఎత్తిపోతలు సంగమేశ్వర, బసవేశ్వర లిప్టులు సర్వే పనులను రూ.27 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మునిపల్లి మండలం లింగంపల్లి సర్వే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంగమేశ్వర, బసవేశ్వర్ లిప్టులతో 3.85 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని, ఆంధోల్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు. సింగూరు బ్యాక్ వాటర్తో రెండు లిఫ్టుల నిర్మాణం చేపడుతామని, కాళేశ్వరం ఎత్తిపోతలతో సింగూరు అనుసంధానం చేస్తామన్నారు. గతంలో కరువుతో, తాగు, సాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు కష్టపడ్డారని, కాంగ్రెస్, టిడిపి పాలనలో ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్లో అడ్డా కూలీలుగా పని చేశారని హరీష్ రావు గుర్తు చేశారు.

