బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరులోని ఓ రాతి క్వారీలో గురువారం భారీ బండరాయి కూలిపోవడంతో బీహార్కు చెందిన ఏడుగురు కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.
బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడపట్టణలో కావేరీ కంపెనీలో తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. రాతి క్రషర్ కేంద్రంలో పనులు జరుగుతుండగా ఒక పెద్ద బండరాయి విరిగి కింద పడి, అక్కడ పనిచేస్తున్న కూలీలపై పడింది. దీంతో రోజువారి కూలీలుగా పనిచేస్తున్న బాధితులు అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో సుమారు 15 నుండి 20 మంది కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. కొత్త క్రషర్ యూనిట్ ఏర్పాటు కోసం, కార్మికులు ఉన్న ప్రదేశానికి దాదాపు 100 అడుగుల ఎత్తులో హిటాచీ యంత్రం ద్వారా స్థలాన్ని చదును చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

