ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10న హైదరాబాద్ పర్యటనకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశిస్తారా? లేదా? అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.
మహేష్ కుమార్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ను ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పాలని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన బిజెపి నేతలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు
జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో వేల కోట్ల అవినీతి జరిగిందని తాము గతంలోనే ఆరోపించామని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ అవినీతి భాగోతంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. అయినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తుపాకీ తమ భుజాలపై పెట్టి కాల్చాలని కేంద్ర బండి సంజయ్ చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

