Dailyhunt
రెండేళ్లలో కశ్మీర్ స్వరూపమే మారిపోతుంది

రెండేళ్లలో కశ్మీర్ స్వరూపమే మారిపోతుంది

సొరంగాల నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం: గడ్కరీ
జోజిలా టన్నెల్ నిర్మాణం పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి

కార్గిల్ : లడఖ్, జమ్మూ, కశ్మీర్‌లో సొరంగాలనిర్మాణం కోసమే ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందని, రాబోయే రెండేళ్లలో కేంద్రం ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో అభివృద్ధి స్వరూపాన్ని మార్చి వేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

లడఖ్‌లో నిర్మాణంలో ఉన్న జోజిలా సొరంగం నిర్మాణం పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. సొరంగం నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈ సొరంగం లడఖ్, కశ్మీర్‌లకు అభివృద్ధి కారిడార్‌గా ఉండబోతోందని ఆయన చెప్పారు.' రెండేళ్లలో జ్రమ్మూ, కశ్మీర్, లడఖ్‌ల స్వరూపాన్నే మార్చి వేస్తాం. రెండేళ్లలో ఇక్కడ మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. నిధుల లభ్యత సమస్యేమీ కాదు. భూ సేకరణ, ఇతర పనులకు స్థానికుల సహకారం అవసరం' అని ఆయన అన్నారు.

లడఖ్, జమ్మూ, కశ్మీర్‌లో సొరంగాల నిర్మాణం కోసమే లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరుగుతోందని, మరో లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టును మంజూరు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. అంతకు ముందు లడఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్, లడఖ్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ కార్గిల్ ఫిరోజ్ అహ్మద్ ఖాన్, ఇతర ఉన్నతాధికారులు జోజిలా టనె ్నల్ వద్దకు వచ్చిన మంత్రికి స్వాగతం పలికారు. రోడ్డు రవాణా, హైవేల శాఖ సహాయమంత్రి జనరల్ వికె సింగ్ వెంట రాగా గడ్కరీ సొరంగం నిర్మాణం పనులను పరిశీలించారు. జోజిలా టన్నెల్ ఆసియాలోనే అతిపెద్ద సొరంగమని,ఈ సొరంగం నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్నదైనప్పటికీ గడువులోగానే దీన్ని పూర్తి చేయగలమన్న ఆశాభావాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu