హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకున్నదని టిఆర్ఎస్ పార్టీ అధినేత కవిత తెలిపారు. ఎంత పెద్ద జబ్బు చేసినా పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కవిత మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల ముందుకు వచ్చామని, సర్వోదయ తెలంగాణ సాధనే తన లక్ష్యమని తెలియజేశారు. ఎన్ జిఒగా జాగృతి కొనసాగుతుందని, ప్రజల గొంతుకగా సమస్యలను ఎత్తి చూపే వేదికగా పనిచేస్తామని అన్నారు. అన్ని అంశాలపై మాట్లాడుతామని..ప్రజల తరపున పోరాడతామని, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. లీడర్స్ వచ్చినా సంతోషమే.. రాకున్నా సంతోషమేనని, దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనామకులు గెలిచారని, అదేవిధంగా మాజీ సిఎం కెసిఆర్ హయాంలో కూడా అలానే గెలిచారని కొనియాడారు. సామాజిక న్యాయానికి బిజెపి వ్యతిరేకమని.. దానిపై పోరాడుతామని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ పేరు రాకుండా కుట్రలు చేశారని, అడ్డంకుల నుంచి బయటపడటానికి కొన్ని టెక్నిక్స్ వాడానని తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ తో తనకు ఎలాంటి విభేదం లేదని, తన నాన్నను విమర్శించలేదని, బిఆర్ఎస్ అధ్యక్షుడు కాబట్టే ఆయన్ని విమర్శించాను, విమర్శిస్తానని కవిత అన్నారు.
పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని కవిత విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు గాస్తున్నారని, ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇస్తున్న హామీల వల్ల ఉపాధి అంటే హాస్యాస్పదం అయ్యిందని, తాము చెప్పే ఉపాధి కల్పన అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదని అన్నారు. యువత, మహిళలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, యువత, మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వాలు భర్తీ చేయని బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కవిత పేర్కొన్నారు.

