ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యోగి, అక్కడి నుంచి నేరుగా తిరుమల చేరుకున్నారు.
తిరుమలకు విచ్చేసిన యోగికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఆయన, స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు యోగి ఆదిత్యనాథ్కు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఆయనను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. యూపీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యోగి ఆదిత్యనాథ్ వెంట బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.

