ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వం తొలి బడ్జెట్ను అసెంబ్లీలో బుధవారంనాడు ప్రవేశపెట్టింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కీలక సంక్షేమ పథకాలను ప్రకటించింది.
ఇందులో భాగంగా మహిళలకు వివాహం సందర్భంగా 'అన్నన్ సీర్' పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద నవవధువులకు 8 గ్రాముల బంగారం, పట్టుచీరను ప్రభుత్వం అందజేస్తుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.812 కోట్లు కేటాయించినట్టు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎన్.మేరీ విల్సన్ ప్రకటించారు. 'తాయ్ మామన్ తంగ మోతిరం తిట్టం' అనే పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద9 రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువుకైనా ఒక గ్రామ బంగారం ఉచితంగా అందజేస్తారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.560 కోట్లు కేటాయించారు.
నిరాశ్రయిలైన వితంతువులు, భర్త వదిలేసిన స్త్రీలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగుల కోసం 'వెట్రి మగలిర్ గోడ్ రియరింగ్ స్కీమ్' ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఐదు మేకలు, గొర్రెలను 100 శాతం సబ్సిడీ కింద అందజేస్తారు. ఇందుకోసం రూ.100 కోట్లు బపడ్జెట్లో కేటాయించారు. 30,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని మంత్రి వివరించారు. బడ్జెట్లో బ్రాండెడ్ సైకిళ్ల పంపిణీ, యువకులకు ఏఐ స్కిల్ ట్రైనింగ్ వంటివి కూడా మంత్రి ప్రకటించారు. కాగా, బడ్జెట్పై విపక్షాలు పెదవి విరిచాయి. బడ్జెట్ మహిళలకు నెలవారీ రూ.2,500 ఆర్థిక సాయం, ఆరు ఉచిత ఎల్పీజీ సిలెండర్లు, రూ.3,000 వృద్ధాప్య పెన్షన్లు, పూర్తిస్థాయిలో పంట రుణాలమాఫీ ప్రస్తావనే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వమి విమర్శించారు. ప్రభుత్వం ఏవిధంగా ఆదాయం సృష్టిస్తుందనే అంశంపై రోడ్మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేసారు.

