అద్దంకి: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితురాలు రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు.
సిఐ సుబ్బరాజు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అద్దంకి మండలం పేరాయపాలేనికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాస రావు తన కోడలికి యూకెలో ఉద్యోగం నిమిత్తం గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రమానందన మామ జె.మోహనరావును 2023లో సంప్రదించారు. ఈ మేరకు అడ్వాన్స్గా రూ.లక్ష చెల్లించారు. అన్ని రకాల పత్రాలు పూర్తి చేసిన తరువాత మరో రూ.9.60 లక్షలు చెల్లడించారు. ఆ తర్వాత అటు ఉద్యోగం రాక.. ఇటు చెల్లించిన నగదు వాపసు చేయకపోవడంతో బాధితుడు ఈ ఏడాది జూన్లో అద్దంకి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు కన్సల్టెన్సీ నిర్వాహకులైన జె.మోహనరావు, భార్య ఝాన్సీలక్ష్మి, కుమారుడు మధుకర్, కోడలు రమానందనతో పాటు రమానందన తల్లిపై కేసు నమోదైంది. యుకె పౌరసత్వం కలిగిన రమానందన బిగ్బాస్ షోకు ఎంపికల నేపథ్యంలో హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె న్యాయవాదిని వెంటబెట్టుకుని అద్దంకి పోలీస్స్టేషన్కు వచ్చి పోలీసుల నుంచి నోటీసులు తీసుకెళ్లినట్లు సిఐ చెప్పారు.

