బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు సమర్పించడానికి జూన్ 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు.
తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలు:
మొత్తం 5000 పోస్టులలో ఏపీలో 188 ఖాళీలు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి 83 ఖాళీలు కేటాయించారు. అభ్యర్థులకు తాము అప్లై చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష (తెలుగు) లో మాట్లాడటం, రాయడం, చదవడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
విద్యార్హతలు, ఇతర నిబంధనలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఒక విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. అయితే.. గతంలో ఎక్కడైనా అప్రెంటిస్ శిక్షణ పొందిన వారు లేదా ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు దీనికి అనర్హులు.
అలాగే డిగ్రీ పూర్తయిన తర్వాత ఏడాది అంతకంటే ఎక్కువ కాలం ఉద్యోగ అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయడానికి వీలుండదు. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) లేదా NAPS పోర్టల్లో అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు మే 1వ తేదీ నాటికి కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా 28 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులైన (PwBD) అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
శిక్షణ కాలం, స్టైపెండ్:
ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 12 నెలల పాటు (ఒక సంవత్సరం) ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ శిక్షణా కాలంలో అభ్యర్థులకు ప్రతి నెలా రూ. 15,000 స్టైపెండ్ రూపంలో చెల్లిస్తారు. ఇది కేవలం అప్రెంటిస్షిప్ శిక్షణ మాత్రమే కాబట్టి.. ఈ సమయంలో ఎలాంటి ఇతర అలవెన్సులు లేదా అదనపు ప్రయోజనాలు లభించవు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదటగా ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల పురుష అభ్యర్థులకు రూ. 800 (ప్లస్ జీఎస్టీ)గా ఉంది. మహిళలు, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు రూ. 600 కాగా.. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 గా పరీక్ష ఫీజు నిర్ణయించారు.
అభ్యర్థులు మరిన్ని వివరాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ (bankofbaroda.bank.in)సందర్శించవచ్చు.

