ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్,ఫార్మసీ విభాగాల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) అభ్యర్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.
జేఎన్టీయూ కాకినాడ నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీ తో పాటు రెస్పాన్స్ షీట్లు కూడా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. మే 12 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు తమ మార్కులను అంచనా వేసుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడనుంది.
కీ, రెస్పాన్స్ షీట్లు డౌన్ లోడ్ చేసుకోండిలా!
ఈఏపీసెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ప్రిలిమినరీ కీ , రెస్పాన్స్ షీట్లను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం విద్యార్థులు మొదట అధికారిక పోర్టల్cets.apsche.ap.gov.in లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ హోమ్పేజీలో కనిపించే 'Response Sheets' లేదా 'Preliminary Key' అనే లింక్లపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత AP EAPCET ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. వెంటనే స్క్రీన్ లపై అభ్యర్థి రాసిన సమాధానాలతో కూడిన రెస్పాన్స్ షీట్ , బోర్డు విడుదల చేసిన మాస్టర్ కీ ప్రత్యక్షమవుతాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.
అభ్యంతరాలకు మే 27 వరకే ఛాన్స్!
ప్రాథమిక కీ లో ఏవైనా తప్పులు ఉన్నాయని అభ్యర్థులు భావిస్తే, వాటిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు కన్వీనర్ అవకాశం కల్పించారు. మే 27వ తేదీ ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా ఈ ఫిర్యాదులను స్వీకరిస్తారు. గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అంగీకరించదు. కాబట్టి విద్యార్థులు నిర్దేశిత సమయంలోపు తగిన ఆధారాలతో తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవడం ముఖ్యం.
రికార్డు స్థాయి హాజరు:
ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 3,55,803 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 3,29,474 మంది (92.60 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ (MPC) విభాగానికి సంబంధించి 2,76,576 మంది నమోదు చేసుకోగా, 2,58,545 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ (BiPC) విభాగానికి 79,227 మంది దరఖాస్తు చేయగా, 70,929 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ పూర్తి చేశారు.
ఫలితాల విడుదలపై సందిగ్ధత:
అధికారిక షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీన ఈఏపీసెట్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫలితాల వెల్లడి కాస్త ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ సెకండియర్ చదివిన విద్యార్థుల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈఏపీసెట్ ఫైనల్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కుల వెయిటేజీ చాలా కీలకం. ఈ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ప్రక్రియ ముగిసి, మార్కులు వెల్లడించే వరకు వేచి చూడాల్సి రావడంతోనే జూన్ 1న ఫలితాల విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఆలస్యంపై విద్యాశాఖ నుంచి ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

