దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించడానికి, అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం నిర్వహించే యూజీసీ నెట్ (UGC NET)పరీక్ష అప్లికేషన్ గడువు రేపటితో ముగియనుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు వీలైనంత త్వరగా.. ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫీజు చెల్లింపు :
అప్లికేషన్ ఫీజును క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏవైనా తప్పులు దొర్లితే.. వాటిని సరిదిద్దుకోవడానికి ఎన్టీఏ "కరెక్షన్ విండో"ను అందుబాటులోకి తెస్తుంది. ఈ కరెక్షన్ విండో ద్వారా అభ్యర్థులు తమ పేరు, విద్యార్హతలు, పరీక్షా కేంద్రాల ఎంపిక వంటి వివరాలను నిర్ణీత గడువులోగా సవరించుకోవచ్చు.
అర్హతలు, పరీక్ష విధానం:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో (రిజర్వేషన్ అభ్యర్థులకు 50 శాతం) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు అర్హులు. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో రెండు పేపర్లుగా జరుగుతుంది. పేపర్-1 అందరికీ జనరల్ గా ఉంటుంది. పేపర్-2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై ఉంటుంది.
అభ్యర్థులు పరీక్షా తేదీలు, హాల్ టికెట్ల అప్డేట్స్ కోసం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.nic.inను సందర్శించవచ్చు.

