Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటర్లు కాదు.. నాయకులే మేల్కోవాలి!

ఓటర్లు కాదు.. నాయకులే మేల్కోవాలి!

భివృద్ధి పనులు చేసి చూపిస్తే ప్రజలు తప్పకుండా గెలిపిస్తారా? అంటే కాదని అనేక ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.

సమైఖ్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రాలోని అన్నమయ్య జిల్లాలోని మారుమూల గ్రామం మంచాలమందలో తాను చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.

ఆ ఊర్లో చాలా మందికి సరైన ఇళ్ళు కూడా లేవు. అలాంటి ఊరికి నేను 500 ఇళ్ళు కట్టించి ఇచ్చాను. చెక్ డ్యామ్‌ కట్టించి సాగునీటి సౌకర్యం కల్పించాను. రోడ్డు వేయించి బస్ సౌకర్యం కల్పించాను. ఇంకా చాలా చేశాను.

ఇవేమీ చేయక మునుపు అదే ఊర్లో నాకు 300 ఓట్లు మెజార్టీ రాగా, ఇవన్నీ చేసిన తర్వాత జరిగిన ఎన్నికలలో నాకు కేవలం 30 ఓట్లు మెజార్టీ వచ్చింది.

ఎందువల్ల? అని నేను విశ్లేషించుకుంటే, ఈ అభివృద్ధి పనులతో అక్కడ మా పార్టీ నాయకులు బాగా డబ్బు సంపాదించుకున్నారు. కొందరు బైకులు, కార్లు కొనుకున్నారు. ఇవి ఆ గ్రామస్తులలో వ్యతిరేకత పెంచేందుకు దోహదపడ్డాయి.

ఆ ఊరు చేరాలంటే 8కిమీ కాలినడక తప్పదు. కనుక నేను ఆ ఊరికి ఒకే ఒక్కసారి వెళ్ళాను. ఎన్ని అభివృద్ధి పనులు చేసినా నేను అక్కడి ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోలేకపోయాను. నా ప్రత్యర్ధులకు ఇది కూడా ఒక అవకాశంగా కలిసి వచ్చింది.

కనుక అభివృద్ధి పనులు చేసేశాం ప్రజలు మనల్నే తప్పక గెలిపించేస్తారనుకోవడం అవివేకమే. వాటితో పాటు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో బలమైన మానవ సంబంధాలు ఏర్పరచుకోవాలి. అలాగే క్షేత్రస్థాయిలో రాజకీయంగా మంచి పట్టు కలిగి ఉండాలి.

వీటికి తోడు కాస్త అదృష్టం, భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. ఇవన్నీ కలిసి వస్తేనే గెలుపు. లేకుంటే ఎంత పెద్ద పార్టీ, నాయకుడికైనా ఓటమి తప్పదు. ఇది నా రాజకీయ అనుభవంతో చెప్తున్న మాట," అని కిరణ్ కుమార్‌ రెడ్డి అన్నారు.

మాజీ సిఎం కేసీఆర్‌ తెలంగాణని అద్భుతంగా అభివృద్ధి చేశారు. కానీ మానవ సంబంధాల ప్రాధాన్యతని గుర్తించలేదు. రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన నన్ను గాక వేరెవరిని ప్రజలు గెలిపిస్తారని అహంభావంతో విర్రవీగారు. ప్రజలు కేసీఆర్‌ని గద్దె దింఛి రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు.

రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సిఎం చంద్రబాబు నాయుడు చాలా వేగంగా గాడినపెట్టి అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. ఆయన కూడా మానవ సంబంధాల ప్రాధాన్యతని విస్మరించి, అమరావతితో ముందుకు సాగారు. అదే సమయంలో జగన్‌ పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యారు. భారీ మెజార్టీతో గెలిపించారు.

జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచితే చాలు… ఓట్లు గలగలా రాలిపోతాయనుకున్నారు. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పక్కన పెట్టి వాలంటీర్లను తీసుకు రావడంతో జగన్‌తో సహా అందరూ ప్రజలకు ఇంకా దూరమయ్యారు.

ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, టీడీపి నేతలు, పవన్ కళ్యాణ్‌ ప్రజలకు చేరువయ్యారు. ప్రజలు జగన్‌ని గద్దె దించి వాళ్ళకి అధికారం కట్టబెట్టారు.

కనుక అభివృద్ధి ఎంత ముఖ్యమో క్షేత్రస్థాయిలో మానవ సంబంధాలు, స్థానిక నేతల వ్యవహార శైలి కూడా అంతే ముఖ్యమని స్పష్టమవుతోంది.

అందుకే ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కానీ ఇప్పటికే ప్యాలస్‌లో రెండేళ్ళు వృధా చేసుకున్న జగన్‌ మరో ఏడాది కూర్చుంటానని చెపుతున్నారు!

ఒక్కోసారి అనూహ్య పరిణామాలతో రాజకీయాలు వాటితో ప్రభుత్వాలు మారవచ్చు. కానీ సాధారణ పరిస్థితులలో పైన చెప్పుకున్న ఈ అంశాలన్నీ నూటికి నూరుశాతం ప్రజలపై ప్రభావం చూపుతుంటాయి. అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తుంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu