'2004లో హైదరాబాద్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా 'నువ్వంటే నేనని' సినిమాను రూపొందించాను. కమర్షియల్ హంగులతో విభిన్నమైన ప్రేమకథగా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది' అని అన్నారు సానాయాదిరెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందించిన చిత్రమిది. నేడు సానాయాదిరెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'వ్యాపార వ్యవహారాల కారణంగా కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నా. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తాను. వాస్తవ ఘటనలతో 'నువ్వంటే నేనని' సినిమాను రూపొందించాను. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఈ సినిమా ఉంటుంది.
నిజమైన, నిండైన జీవితానికి ప్రేమ, స్నేహం అవసరమేననే సందేశంతో భావోద్వేగభరితంగా ఉంటుంది. ప్రముఖ ఓటీటీ యాప్ ద్వారా ఈ సినిమాను విడుదలచేయబోతున్నాం. ఈ సినిమా ద్వారా నకుల్, శ్వేతాను నాయకానాయికలుగా పరిచయంచేస్తున్నాం. వరికుప్పల యాదగిరి సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. తదుపరి సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి' అని తెలిపారు.

