తాజావార్తలు
అమిత్షా ఖాతా ఎందుకు బ్లాక్ చేశారు?!

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారని ట్విట్టర్ ప్రతినిధిని పార్లమెంటరీ కమిటీ నిలదీసింది. పౌరుల హక్కుల పరిరక్షణతోపాటు సోషల్ మీడియాలో దుర్వినియోగం, మహిళల భద్రత ఎజెండాపై గురువారం సోషల్ మీడియా సంస్థలు ట్విట్టర్, ఫేస్బుక్ భారత్ ప్రతినిధులు పార్లమెంటరీ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్షా ట్విట్టర్ ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారు? ఆ అధికారం మీకెవరు ఇచ్చారు? అని ట్విట్టర్ ప్రతినిధులను నిలదీసినట్లు సమాచారం.
అయితే, అమిత్షా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రంపై కాపీరైట్స్ ఉండటంతో గతేడాది నవంబర్ నెలలో తాత్కాలికంగా నిలిపివేశామని, పొరపాటు సరి చేసిన తర్వాత పునరుద్ధరించామని ట్విట్టర్ అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఇంతకుముందు భారత్లోని అధికార బీజేపీ, మితవాద సంస్థలు చేసే ద్వేషపూరిత ప్రసంగాలు, పోస్టులను ఫేస్బుక్ పట్టించుకోవట్లేదని గతేడాది సెప్టెంబర్లో విమర్శలు వచ్చాయి.