
నూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేమి లేదని, ఎగుమతుల్లో పురోగతి సాధిస్తున్నామని, దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో చెల్లింపులకు నిధులు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. కరోనా వైరస్తో కుదేలైన ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నట్టు సంకేతాలు వస్తున్నాయని ఫిక్కీ నిర్వహించిన వెబినార్లో ఆయన పేర్కొన్నారు. గత నెలలో ఎగుమతులు ఆశించిన వృద్ధిని కనబరిచాయని, 2019 జూలైలో నమోదైన దాంట్లో 91 శాతానికి చేరుకున్నాయని తెలిపారు. అలాగే దిగుమతులు కూడా 70-71 శాతంగా నమోదైనట్లు చెప్పారు. విదేశాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దేశీయ పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం ఏర్పడిందని, దీంతో వృద్ధి మరింత కోలుకుంటుదని అన్నారు.
పెట్రోలియం, టెక్స్టైల్ రంగాల్లో నెలకొన్న మందగమనం వల్ల వరుసగా నాలుగు నెల జూన్లోనూ ఎగుమతులు తగ్గుముఖం పట్టాయని, ఇదే సమయంలో వాణిజ్యంలో మిగులు నమోదైందని చెప్పారు. తయారీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయన్నారు.