Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భవసాగర నావ నామస్మరణ

భవసాగర నావ నామస్మరణ

  • మంచి మాట

'చేతోదర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం' అంటారు. నిరంతరం భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల మనసు అనే అద్దంపై పేరుకుపోయిన కల్మషాలు, చెడు ఆలోచనలు తొలగిపోతాయి.

లౌకిక జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభించి, మనసుకు ప్రశాంతత సిద్ధిస్తుంది. భగవంతుడిని పూజిస్తే.. మనసా వాచాకర్మణా భగవంతుడు తప్ప అన్యమేమీ లేదని స్థిర నిశ్చయంతో పూజ చేయాలి. నామస్మరణకు కాలం, సమయం, ఆసనంతో పనిలేదు. నడుస్తున్నా, కూర్చున్నా, పనులు చేసుకుంటున్నా మనసులో భగవంతుడిని తలచుకోవచ్చు.

భగవంతుని నామం ఒక అమృతధార వంటిది. అది సంసార సాగరాన్ని దాటించే ఒక దివ్య నౌక. మీ ఇష్టదైవం ఎవరైనా, వారి నామాన్ని నిరంతరం స్మరించడం వల్ల జీవితం ధన్యమవుతుంది. కలియుగంలో పుణ్యం సంపాదించడానికి కేవలం భగవన్నామస్మరణ మాత్రమే శరణ్యం అని పెద్దలు చెపుతారు. అయితే ఆ నామస్మరణ మనఃస్ఫూర్తిగా చెయ్యాలి. కేవలం ఆర్భాటం కోసమో, పేరుకోసమో, అందరూ నన్ను గుర్తించాలనో, లేక గొప్ప భక్తుడినన్న అహంకారంతోనో ఇంకేదైనా కారణాలు పెట్టుకుని భగవంతుని స్మరణ చేస్తే లాభమేమీ ఉండదు.

నామస్మరణకు ఎటువంటి నియమాలు లేవు. కేవలం మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమాలు లేవు, నామస్మరణతో ప్రతి ఒక్కరూ తరించవచ్చు. ఏ సందర్భంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నామస్మరణ చేయడం మంచిదే. 'నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే' వంటి శాస్త్ర వాక్యాలు నామస్మరణ ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. మనసు ఎప్పుడూ అశాంతిగా, అల్లకల్లోలంగా ఉంటుంది. భగవన్నామ జపం ద్వారా అది ఒకే దిశలో నిలబడుతుంది. ఇది మనసును శాంతితో నింపుతుంది. భగవన్నామం పరమ పవిత్రమైనది. దాన్ని జపించినప్పుడల్లా మనలోని నిగూఢ దోషాలు తొలగిపోతాయి. స్తోత్రాలు, పూజలు, తపస్సు కన్నా భగవన్నామస్మరణ శక్తిమంతమైన మార్గం. ఇది భగవంతుడి అనుగ్రహాన్ని వెంటనే అనుభవించేందుకు సహాయపడుతుంది. భగవన్నామం వినగానే మన జీవితంలోని కార్మిక బంధనాలు కరిగిపోతాయి. శంకరాచార్యులు కూడా 'హరే నామ కేవలం' అనే మాటని పెద్దగా ప్రశంసించారు. రోజూ భగవన్నామ జపం వల్ల మనం భగవంతునికి దగ్గరవుతాం. మన లోక సంబంధాలపై ఆసక్తి తగ్గి, ఆధ్యాత్మికత పెరుగుతుంది.

మనం పుణ్యక్షేత్రాలకు వెళ్లేది కేవలం ఒక విగ్రహాన్ని చూడటానికి కాదు. అక్కడ లభించే సాత్విక శక్తిని, ప్రశాంతతను గుండెల్లో నింపుకొని… బయట ప్రపంచంలోకి వచ్చాక ఆ దైవత్వాన్ని సాటి మనిషిలో చూడటానికే. గుడిలో ఉన్న దేవుడికి హారతి ఇచ్చి, గుడి బయట ఆకలితో అలమటించే తోటి జీవిని ఆదరించకపోతే, ఆ పూజను భగవంతుడు అంగీకరించడు.

భక్తి అంటే కేవలం పదిసార్లు భగవన్నామస్మరణ చేయడం, పూసలు తిప్పడం, అందరికీ కనబడేలా రుద్రాక్ష దండలు వేసుకోవడం, ఆడంబరంగా మాట్లాడటం కాదు. భక్తి వేరు, జ్ఞానం వేరు, కర్మ వేరు కాదు. పూజా మందిరంలో చేసే భక్తి కేవలం ఒక ప్రారంభం మాత్రమే. అది పరిపక్వత చెంది, హృదయం విశాలమై, సాటి మనిషి కన్నీరు తుడిచే కరుణగా మారినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. భక్తుడు భగవంతుడిగా మారే అద్భుతమైన స్థితి అదే! భగవంతుడు మనల్ని బాధ్యతలను వదిలేసి అడవులకు వెళ్లమనడం లేదు. మనం చేసే పనిని దైవకార్యంగా భావిస్తూ, లౌకిక కష్టాల మధ్యలో కూడా భగవంతుడిని స్మరించడమే నిజమైన సాధన. జీవితంలో ఎన్ని కష్టాలున్నా, బాధ్యతల నడుమ వీలు చిక్కినప్పుడల్లా భగవంతుడిని తలచుకోవడం… నిష్కల్మషమైన భక్తికి, ఆధ్యాత్మిక పరిపక్వతకు నిదర్శనం.

…?తరిగొప్పుల వి ఎల్లెన్‌ మూర్తి, 80085 77834

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana