రియో: బ్రెజిల్(Brazil)లో ఓ గమ్మత్తు ఘటన జరిగింది. ఫుట్బాల్ టోర్నీలో ఓ ప్లేయర్ గోల్ కొట్టిన సందర్భాన్ని ఎంజాయ్ చేయబోయి.. అనుకోకుండా అతను స్టేడియం టన్నెల్లో పడ్డాడు.
కోరిటిబా క్లబ్ డిఫెండర్ జేసీ మరనహో.. చాపకోనిస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గోల్ కొట్టాడు. అయితే గోల్ పోస్టు నుంచి సంబరాలు చేసుకుంటూ ప్రేక్షకుల వైపు వెళ్లాడు. కొంత దూరంలో ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డును ఆ సంతోషంలో దూకేశాడు. కానీ ఆ సందర్భంలో అనూహ్య ఘటన జరిగింది. బోర్డు వెనుక ఉన్న స్టేడియం టన్నెల్లో ఆ ప్లేయర్ పడిపోయాడు. ఈ ఘటన నవ్వు తెప్పిస్తున్నా.. గోల్ సంబరం వల్ల ఆ ప్లేయర్ తీవ్రంగా గాయపడ్డాడు.
టన్నెల్లో పడిన తర్వాత కాసేపటికి ప్లేయర్ జేసీ మళ్లీ బయటకు వచ్చాడు. మడిమ దెబ్బతిన్నా.. గోల్ కొట్టానన్న సంతోషంతో గంతులేశాడు. కానీ కాసేపటికి ఆ ప్లేయర్ గాయం వల్ల మ్యాచ్ను వీడాడు. అయితే వీఏఆర్ వీడియో రివ్యూ ద్వార జేసీ కొట్టింది గోల్ కాదని తేల్చారు. ప్లేయర్ ఆఫ్సైడ్ ఉన్నట్లు రూల్ చేశారు. ఏదేమైనా చివరకు జేసీకి చెందిన కొరిటిబా జట్టు మ్యాచ్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇదే స్టేడియంలో గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 2014లో కెమరూన్ జట్టు ప్లేయర్ జోయల్ కూడా సెలబ్రేషన్లో భాగంగా అడ్వర్టైజింగ్ బోర్డు వద్ద జంప్ చేసి స్టేడియం టన్నెల్లో పడ్డాడు.

