Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డబుల్‌ బెడ్రూం దందా.. కేసీఆర్‌ కట్టించిన ఇండ్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్‌

డబుల్‌ బెడ్రూం దందా.. కేసీఆర్‌ కట్టించిన ఇండ్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్‌

  • రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు
  • ఒక్కో ఇల్లు రూ.3 లక్షలు నుంచి రూ.10 లక్షలకు విక్రయం
  • అనర్హులు, స్థానికేతరులకు అడ్డగోలుగా అమ్మేస్తున్న వైనం
  • సంబంధిత అధికారులకూ అందుతున్న వాటాలు
  • పేదల సొంతింటి కలను దూరం చేస్తున్న సర్కార్‌ పెద్దలు
  • సగానికి పైగా అనర్హులకే దక్కుతున్న డబుల్‌ ఇండ్లు

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేసీఆర్‌ లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే పూర్తయిన సగానికిపైగా గృహాలను అర్హులకు ఉచితంగా పంపిణీ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు.. గ్రేటర్‌ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను అమ్ముకుంటున్నారు. దీంతో అర్హులైన నిరుపేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతున్నది. మంత్రులు వారి అనుచరులు, కాంగ్రెస్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలు వారి పీఎలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు గ్రేటర్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్ల దందా జోరుగా సాగిస్తున్నారు. అనర్హులు, ఇతర ప్రాంతాల వారికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు ఒక డబుల్‌ బెడ్రూం ఇల్లు చొప్పున విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

-సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ)

గ్రేటర్‌ వ్యాప్తంగా వందలాది ఇండ్లను విచ్చలవిడిగా అమ్ముకుంటూ నిరు పేదలకు దక్కాల్సిన ఇండ్లను పక్కదారి పట్టిస్తున్నారు కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు. తమ అధికార బలం చూపించి తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ దాకా మభ్యపెడుతూ డబుల్‌ బెడ్రూం ఇండ్ల దందాను సాగిస్తున్నారు. ధూల్‌పేట గుడుంబా నిర్వాసితులు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులకు దక్కాల్సిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను డబ్బులకు ఇతరులకు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం గ్రేటర్‌ చుట్టుపక్కలా కేసీఆర్‌ కట్టించిన డబుల్‌ బెడ్రూంలను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా మూసారాంబాగ్‌ డివిజన్‌ అంబేద్కర్‌ నగర్‌ బస్తీ వాసులకు ప్రతాప సింగారం, జియాగూడ ప్రాంతాల్లోని డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. కానీ అర్హులైన వారిలో కొందరికి మాత్రమే కేటాయించారు.

అవి కాకుండా ఇంకా దాదాపు 80 పైగా ఇండ్లను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా అనర్హులకు విక్రయిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ దందాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డబుల్‌ బెడ్రూం ఇల్లు కావాలనుకునేవారు ముందుగానే రూ.3 లక్షలు చెల్లించాలి. అందులో రూ.లక్ష దాకా రెవెన్యూ అధికారులకు చెల్లిస్తారు. మిగిలిన రెండు లక్షలు వారు పంచుకుంటారు. ఇదే తరహాలో ముసీ ప్రాజెక్టు బాధితుల పేరిట ఇతర ప్రాంతాల వారికి ఇక్కడి చిరునామా సృష్టించి విక్రయిస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్‌ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అనుచరులు అనర్హులకు రూ.10 లక్షల దాకా విక్రయిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులకు వారి వాటాను పంపిస్తూ తమకు కావలసినవాళ్లకు ఇల్లు కేటాయించేలా మాట్లాడుకుంటున్నారు. ఈ దందా గ్రేటర్‌ వ్యాప్తంగా సాగుతున్నది. దీంతో సగానికి పైగా అనర్హులకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు దక్కుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana