- తాసిల్దార్ వెంకటకృష్ణ
ఖిల్లాఘణపురం : రాష్ట్రంలోని రైతులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలను గురువారం ప్రారంభించింది. అందులో భాగంగానే ఖిల్లాఘణపురంలోని రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ వెంకటకృష్ణ డిప్యూటీ తాసిల్దార్ మల్లికార్జున్తో కలిసి ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో రిజిస్ట్రర్ సేవలు రానున్నట్లు అందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన రైతుల రిజిస్ట్రేషన్ సేవలు రెవెన్యూ కార్యాలయంలోనే అందనున్నట్లు తెలిపారు. రైతులు ధరణి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చిన్నంబావిలో..
చిన్నంబావి : మండలకేంద్రంలోని తాసిల్దార్ కార్యాల యం భవన సముదాయంలో ధరణి పోర్టల్ సేవల నిర్వాహణకు గురువారం ప్రత్యేక కార్యాలయం గదిని తాసిల్దార్ శాంతిలాల్ ప్రారంభించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలకు కావలసిన కంప్యూటర్లు, సామగ్రితో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తాసిల్దారు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వీపనగండ్లలో..
వీపనగండ్ల : మండల కేంద్రంలో జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తాసిల్దార్ యేషయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలను సులభంగా అందించాలని ప్రభుత్వం ధరణి పోర్టల్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీటీ లక్ష్మీకాంత్, ఆర్ఐ రాజేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు.

