
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): గతేడాది నవంబర్ 2న ప్రారంభమైన ధరణి పోర్టల్ వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. రెండున్నర నెలల్లోనే 1,03,106 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తిచేసింది. పోర్టల్ ప్రారంభమైన మొదటివారం రోజులు కొన్ని సాంకేతికసమస్యలు ఎదురైనా.. కొద్దిరోజుల్లోనే అధికారులు వాటిని పరిష్కరించారు.
ప్రస్తుతం రోజుకు సగటున రెండువేలకుపైగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగానే పావుగంటలోనే పట్టా చేతికొస్తున్నది.
సర్వం ధరణీమయం
వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్త సేవలకు ధరణి పోర్టల్ వేదికైంది. మొదట్లో స్లాట్బుకింగ్, నూతన రిజిస్ట్రేషన్ సేవలు మాత్రమే అందుబాటులోకిరాగా ఇప్పుడు ప్రతి సమస్యకూ ధరణి పరిష్కారం చూపుతున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పోర్టల్లో ఆప్షన్లను జత చేస్తున్నది. రాష్ట్రంలో క్లియర్గా ఉన్న సుమారు 1.46 లక్షల ఎకరాల భూముల రికార్డులు ధరణిలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలనుంచైనా చూసుకునే అవకాశం కలిగింది. పట్టాభూములు, నిషేధిత భూములు వేటికవే వేర్వేరుగా పొందుపర్చారు. ఈసీ వివరాలు సైతం పోర్టల్లో అప్లోడ్ చేశారు.
ప్రతి సమస్యకూ ఒక ఆప్షన్
వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఈ మేరకు సమగ్రంగా అధ్యయనం చేయించింది. ఇటీవలే రెవెన్యూ డివిజన్కు ఒక గ్రామాన్ని ఎంచుకొని వ్యవసాయ భూములకు సంబంధించిన అన్నిరకాల సమస్యలపై అధికారులు నివేదిక రూపొందించారు. దీని ఆధారంగా సమస్యలన్నింటినీ గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు సిటిజన్ లాగిన్లో, మీసేవలో కొత్త ఆప్షన్లను జతచేశారు. తాసిల్దార్లు, ఆర్డీవోల అధికారాలకు కత్తెర వేసి.. వాటి పరిష్కార బాధ్యతలను కలెక్టర్లకు అధికారం అప్పగించింది. ఒక్కో సమస్య పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది.
గురువారం నాటికి
స్లాట్ బుకింగ్స్ : 1,07,182
రిజిస్ట్రేషన్లు : 1,03,106
పారదర్శకంగా.. సులభంగా..
ధరణి ద్వారా పారదర్శకంగా, సులభంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్తోపాటు, మ్యుటేషన్ పూర్తిచేసుకుని వెళ్తున్నారు. ప్ర భుత్వం తాజాగా మరి న్ని ఆప్షన్లు ఇవ్వడంతోపాటు, స్లాట్లు పెంచింది. గురువారం 19 లావాదేవీలు పూర్తిచేశాం.
- రాంరెడ్డి, తాసిల్దార్, నేరేడుచర్ల, సూర్యాపేట
10 నిమిషాల్లోనే పాస్బుక్కు..
స్లాట్ బుక్చేసుకుని వేములవాడ తాసిల్దార్ ఆఫీస్కెళ్లా. 10నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూ ర్తిచేసి పాస్బుక్ ఇచ్చారు. కేసీఆర్కు కృతజ్ఞతలు.
- పత్తి నర్సింహారెడ్డి, వేములవాడ, రాజన్నసిరిసిల్ల