Dailyhunt
ఎన్డీఏలో చేరండి.. శరద్‌ పవార్‌కు కేంద్రమంత్రి అథవాలే ఆహ్వానం

ఎన్డీఏలో చేరండి.. శరద్‌ పవార్‌కు కేంద్రమంత్రి అథవాలే ఆహ్వానం

ముంబయి : కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ(అథవాలే) చీఫ్‌ రాందాస్‌ అథవాలే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాలని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ను ఆహ్వానించారు. ఆయన అపార రాజకీయ అనుభవంతో దేశం, మహారాష్ట్ర లబ్ధి పొందుతాయన్నారు. శివసేనకు బదులుగా పవార్ బీజేపీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీ, ఎన్‌సీపీ, ఆర్‌పీఐ (ఏ) మహారాష్ట్రలో గొప్ప కూటమిని ఏర్పాటు చేసుకోవాలని, పవార్ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పని చేయాలన్నారు. శివసేనతో జట్టు కట్టినందున ఎన్సీపీకి ఎలాంటి ఉపయోగం లేదని, శరద్‌ పవార్‌ ఎన్డీఏలో భాగస్వామ్యమమ్యేందుకు సిద్ధంగా ఉంటే బీజేపీ, ఎన్సీపీ, ఆర్పీఐ(ఏ)లు మహారాష్ట్రలో 'మహాయుతి'ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

కేంద్రం నుంచి మహారాష్ట్రకు అధిక నిధులు రావాలంటే ఈ విషయం గురించి పవార్ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా అథవాలే తన అభిప్రాయాలను వీడియోలో వెల్లడించారు.

'శరద్ పవార్ మహారాష్ట్ర సీనియర్ నాయకుడు. రైతులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల సమస్యల గురించి ఆయనకు తెలుసు. దేశానికి ఇది ఎంతో కీలకం, నరేంద్ర మోడీతో చేతులు కలపాలని ఆయనను కోరుతున్నాను ఇది నా వ్యక్తిగతమైన కోరిక.'అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. కాగా, మహారాష్ట్రలోని బీజేపీ శివసేన కలిసి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాయి. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా, సేనకు 56 సీట్లు వచ్చాయి. తొలుత సీఎంగా పడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేసి, సరైన బలం లేకపోవడంతో పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో శివసేన కాంగ్రెస్, ఎన్సీపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బహిరంగంగా శరద్‌ పవార్‌కు ఎన్డీలో చేరాలంటూ కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేయడం చర్చనియాంశంగా మారింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana