Dailyhunt
ఎయిర్‌ ఇండియా రేసులో టాటాలు

ఎయిర్‌ ఇండియా రేసులో టాటాలు

  • ముగిసిన బిడ్డింగ్‌ ప్రక్రియ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కొనుగోలు రేసులో టాటాలు పోటీపడుతున్నారు.

ఎయిర్‌ ఇండియా కోసం బిడ్‌ దాఖలు చేసినట్లు టాటా సన్స్‌ అధికారప్రతినిధి ఒకరు పీటీఐకి తెలిపారు. స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ కూడా కొనేందుకు ఆసక్తి చూపుతుండగా, దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఎయిర్‌ ఇండియాను కొనేందుకు పలు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని బుధవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 'ఎయిర్‌ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా లావాదేవీ సలహాదారు ఆయా కంపెనీల నుంచి బిడ్లు అందుకున్నారు.

ఇప్పుడిక ఈ ప్రక్రియ చివరి దశకు చేరింది' అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటాను అమ్మేయాలని మోదీ సర్కారు చూస్తున్న విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో మొదలైన ఈ అమ్మకం ప్రక్రియకు కరోనా పరిస్థితులు అడ్డుతగలగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో బిడ్లను కేంద్రం ఆహ్వానించింది. బుధవారంతో ఈ గడువు ముగిసిపోయింది.

2019 మార్చి 31 నాటికి ఎయిర్‌ ఇండియా రుణ భారం రూ.60,074 కోట్లుగా ఉన్నది. సంస్థను కొనేవారు రూ.23,286.5 కోట్లను మోయాల్సిందే. మిగతాది ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు బదిలీ అవుతుంది. 2007 నుంచి ఎయిర్‌ ఇండియా నష్టాల్లోనే నడుస్తున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana