Hardik Pandya : భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. 20వ సీజన్కు ముందే పాండ్యాను వదిలించుకోవాలని ముంబై ఇండియన్స్(Mumbai Indians) భావిస్తుండగా..
‘మాకివ్వండి.. మేము కొనుక్కుంటాం’ అని ముందుకొస్తున్నాయి. మొన్నటివరకూ పాండ్యాను స్వాపింగ్ పద్ధతిన తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఆసక్తి చూపగా.. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) సైతం రేసులోకి వచ్చింది.
ఐపీఎల్ 2027కు ముందే ట్రేడ్ డీల్ హంగామా నడుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పరస్పర ఒప్పందం కుదరడంతో.. రిషభ్ పంత్(Rishabh Pant) ఢిల్లీకి, కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)ను లక్నోకు మారారు. మరి.. హార్దిక్ పాండ్యా సంగతేంటీ? అని అభిమానులు అడుగుతున్నారు. ఎందుకంటే.. పంత్ -కుల్దీప్ స్వాపింగ్ కంటే ముందే పాండ్యా పేరు తెరపైకి వచ్చింది.
ఐపీఎల్లో విలువైన ఆటగాడిగా నిరూపించుకున్న అతడిని రాజస్థాన్ రాయల్స్కు ఇచ్చేసి.. బదులుగా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)ను తీసుకోవాలని ముంబై అనుకుంది. కానీ, అందుకు రాజస్థాన్ తటపటాయించింది. ఇదిలా ఉండగానే.. మ్యాచ్ విన్నర్, నిఖార్సైన ఆల్రౌండర్ కోసం వెతుకుతున్న కోల్కతా నైట్ రైడర్స్ పాండ్యాను తీసుకునేందుకు ముందుకొచ్చిందని పీటీఐ కథనం పేర్కొంది.
రహానే స్థానంలో
ఐపీఎల్ 19లో కెప్టెన్గా విఫలమైన అజింక్యా రహానే (Ajinkya Rahane) స్థానంలో పాండ్యాను తెచ్చుకోవాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది. అందుకని ముంబైకి పెద్ద మొత్తం చెల్లించి.. లేదంటే ట్రేడ్ డీల్ పద్ధతిన ఈ డాషింగ్ బ్యాటర్ను తమ గూటికి చేర్చుకోవాలని కోల్కతా పావులు కదుపుతోంది. మరోవైపు ముంబై ప్రతిపాదించినట్టుగా యశస్వీని అప్పగించి.. పాండ్యాను తీసుకునే అంశంపై రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా ఆలోచిస్తోంది. అయితే.. రియాన్ పరాగ్ను మరికొన్ని సీజన్లు కెప్టెన్గా కొనసాగించాలని రాజస్థాన్ అనుకుంటోంది. దాంతో, గులాబీ జెర్సీ వేసుకున్నా సరే పాండ్యాకు వెంటనే కెప్టెన్సీ దక్కకపోవచ్చు.
టీ20ల్లో.. ముఖ్యంగా ఐపీఎల్లో హిట్టైన హార్దిక్ను దక్కించుకునేందుకు ఇరు ఫ్రాంచైజీలు ముంబై యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాయి. అయితే.. చివరకు పాండ్యాను ఏ జట్టుకు ముంబై అప్పగిస్తుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది. చూస్తుంటే.. వారం పది రోజుల్లో ముంబై, కోల్కతా, రాజస్థాన్ మధ్య ట్రేడ్ డీల్ జరిగే అవకాశముంది.

