Dailyhunt
జూన్‌లో మహిళలపై అత్యధిక వేధింపులు

జూన్‌లో మహిళలపై అత్యధిక వేధింపులు

ఢిల్లీ : మహిళలపై వేధింపులు జూన్‌ నెలలో అత్యధికంగా నమోదయ్యాయి. జాతీయ మహిళా కమిషన్‌కు జూన్‌ నెలలో 2,043 ఫిర్యాదులు అందాయి. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధికం. జాతీయ మహిళా కమిషన్‌ గణాంకాల ప్రకారం జూన్‌లో ఎన్‌సీడబ్ల్యూకి 452 గృహహింస, 603 మానసిక వేధింపులు, వివాహిత మహిళలపై వేధింపులు, వరకట్న వేధింపులకు సంబంధించి 252, మహిళలపై వేధింపులు 194, మహిళల పట్ల పోలీసుల ఉదాసీనతకు సంబంధించి 113, సైబర్‌ నేరాలకు సంబంధించి 100, అత్యాచారం, అత్యాచారయత్నంకు సంబంధించి 78 ఫిర్యాదులు, వరకట్న వేధింపుల మరణాలకు సంబంధించి 27, పరువు హత్యలు, నేరాల కింద 45 ఫిర్యాదులు అందాయి.

ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందిస్తూ...

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కమిషన్‌ కార్యకలాపాలు పెరగడం కూడా ఫిర్యాదులు పెరగడానికి ఓ కారణమన్నారు. ట్విట్టర్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికలుగా తాము ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వాట్సప్‌ నెంబర్‌ ద్వారా సైతం ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇటువంటి సదుపాయాలు ఉండేవి కాదన్నారు. తాము సహాయం చేస్తున్నట్లు ప్రజలు నమ్ముతున్నారని అందుకే తమను ఆశ్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

గడిచిన నెలల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి అందిన ఫిర్యాదుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మే నెలలో 1500, ఏప్రిల్‌లో 800, మార్చిలో 1,347, ఫిబ్రవరిలో 1,424, జనవరిలో 1,462, డిసెంబర్‌లో 1,402, నవంబర్‌లో 1,642, అక్టోబర్‌లో 1,885 ఫిర్యాదులు ఎన్‌సీడబ్ల్యూకి అందాయి. మహిళల శ్రేయస్సు, సాధికారత కోసం ఎన్‌సీడబ్ల్యూ పనిచేస్తుందని, బాధితులు ఎప్పుడైనా, ఏ రోజైనా తమని సంప్రదించవచ్చని రేఖా శర్మ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana