పెద్దపల్లి : జిల్లా విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట శ్రీహరిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గోదావరిఖని వన్ టౌన్ సీఐ పర్స రమేశ్ గురువారం వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీకి చెందిన ఎనగందుల రమేశ్ (35) జిల్లా విద్యా విభాగంలో జీసీడీవో పద్మ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేసేవాడు. సెక్షన్ సెక్టోరల్-1 పోస్ట్ ఖాళీ కావడంతో రమేశ్ డీఈవో వెంకటేశ్వర్లుకు దరఖాస్తు పెట్టుకున్నాడు. పరిశీలించిన డీఈవో ఉన్నతాధికారులకు ఫార్వర్డ్ చేశారు. అయితే పద్మ, రమేశ్ను ఉన్నతాధికారుల ఎదుట కించపరిచింది.
వారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేసింది. అలాగే ఎస్ఎస్వై స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి సైతం రమేశ్తో దురుసుగా మాట్లాడాడు. దీంతో వీరిద్దరి వేధింపులు తాళలేక గతేడాది ఆగస్టు 28న రమేశ్ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీడీవో పద్మ, ఏఎస్పీడీ వెంకట శ్రీహరి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు రమేశ్ రాసిపెట్టిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయగా నిజమని తేలడంతో గురువారం శ్రీహరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే జంపాల పద్మకు సంబంధించి విచారణ నివేదికను ప్రాజెక్టు డైరెక్టర్కు పంపించామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..

