'ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్స్టోరీస్తో వారిని థియేటర్లకు రప్పించలేం. కొత్త కంటెంట్కు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు.
ఈ సినిమాను కూడా యూనిక్ పాయింట్తో తెరకెక్కించాం' అన్నారు కథానాయకుడు వడ్డే నవీన్. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన ఇండస్ట్రీలోకి పునరాగమనం చేస్తూ స్వీయ నిర్మాణంలో నటించిన చిత్రం 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'. కమల్తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం వడ్డే నవీన్ పాత్రికేయులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
నా మనసుకు నచ్చిన కథలు దొరకని కారణంగానే ఇన్నేళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్నా. 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'లోని పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. వృత్తిలో నిజాయతీగా ఉండే కానిస్టేబుల్ త్రిమూర్తులు 55 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ నేపథ్యంలో అతను వ్యవస్థతో చేసిన పోరాటం ఏమిటన్నదే ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం.
ఈ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉత్కంఠను పంచుతాయి. ప్రతీ సన్నివేశం రియలిస్ట్గా ఉంటుంది. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం కాబట్టి పాత్రపరంగా ఎలాంటి సన్నద్ధత అవసరం కాలేదు. ఓ సాధారణ కానిస్టేబుల్గా ఎక్కడా నాటకీయత లేకుండా సహజంగా నటించాను. ఇటీవలే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఓ వందమందికి ఈ సినిమా చూపిస్తే వాళ్లు సర్ప్రైజ్ అయ్యారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని చెప్పారు. ప్రస్తుతం సోలో హీరోగానే సినిమాలు చేయాలనుకుంటున్నా. కథ నచ్చితే మల్టీస్టారర్స్కు కూడా సిద్ధంగా ఉన్నా.

