Dailyhunt
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల కొమ్ము కాస్తోంది

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల కొమ్ము కాస్తోంది

కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల కొమ్ము కాస్తూ రాష్ర్టాల హక్కులను విచ్ఛిన్నం చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదిర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి, ఓగులాపూర్‌, రామంచ గ్రామాల్లో అమరుల స్తూపాల వద్ద నివాళులర్పించి పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం ఇందుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం బొగ్గు, పవర్‌ ప్లాంట్‌లను ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేపట్టిందని, జీఎస్టీ పేరుతో ఇప్పటికే పేద ప్రజలకు పెను భారం మోపిందని మండిపడ్డారు.

విద్యుత్‌ను సైతం ప్రైవేటీకరించేందుకు రాష్ర్టాల నుంచి కేంద్రం చేతిలో తీసుకొనేందుకు ప్రయత్నాలు చేపట్టిందన్నారు.

రాష్ర్టాల్లో మతాల పేరిట కుట్రలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నదని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం అన్ని రంగాల్లో మొండి చేయి చూపుతున్నదని, రాష్ర్టాల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదన్నారు. రాష్ర్టాలకు రావాల్సిన వాటాలను ఇవ్వడంలోనూ విఫలమైందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సీపీఐ పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana