టెహ్రాన్ : పెరుగుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఇరాన్లో లాక్డౌన్ సాధ్యం కాదని అధ్యక్షుడు హసన్ రౌహానీ అన్నారు. శనివారం రౌహానీ ఒక టీవీ సమావేశంలో మాట్లాడుతూ దేశం విధించిన కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలను కొనసాగించాలని సూచించారు.
ఇరాన్లో ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పరిమితులు ఎత్తివేశారు. దీంతో అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా మరణాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఇరాన్ ఆరోగ్య మంత్రి సాయిద్ నమ్కీ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవడం కాస్త ఉపశమనం కలిగించిందన్నారు. కానీ ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జీవనం సాగించాలని, భౌతికదూరం తప్పనిసరి అని అన్నారు.
ఇరాన్లో గురువారం ఒక్కరోజే 221మంది కరోనాతో మరణించారు. ఇది దేశంలో ఒక్క రోజు రికార్డు మరణాలుగా అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. ఇప్పటి వరకు ఇరాన్లో 12,400 మందికి పైగా కరోనా వ్యాధితో మరణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది.

