హైదరాబాద్: ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కరుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు దక్షిణ అండమన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రత స్వలంగా తగ్గుతాయని పేర్కొన్నారు. పంట నూర్పిడి చేసిన వారు కొనుగోలు కేంద్రాల వద్ద వాటిని తడవకుండా చూసుకోవాలని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని అధికారులు సూచించారు.

