Dailyhunt

కోవిడ్‌19తో హాస్పిటల్ డైరక్టర్ మృతి

హైదరాబాద్‌: చైనాలో కరోనా వైరస్ పుట్టిన వుహాన్ నగరంలో.. అక్కడి ప్రధాన హాస్పిటల్ డైరక్టర్ ఆ వైరస్ వల్ల మృతిచెందాడు. కోవిడ్‌-19 వ్యాధి వుహాన్ నగరం నుంచి చైనా మొత్తం పాకినట్లు తెలిసిందే. వుహాన్‌లోని వుచాంగ్ హాస్పిటల్ డైరక్టర్ లియూ చిమింగ్ వైరస్ వల్ల మృతిచెందినట్లు నిర్ధారించారు. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లు అధికారులు వెల్లడించారు. వైరస్‌ను నియంత్రించేందుకు శ్రమిస్తున్న మెడికల్ వర్కర్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 2వేల మంది మెడికల్ వర్కర్లకు కరోనా వైరస్ సోకింది. ఇవాళ్టి వరకు కోవిడ్‌-19 వల్ల చైనాలో సుమారు 1868 మంది మరణించారు. కోవిడ్‌19 సోకిన పేషెంట్ల నివేదికను చైనా ఆరోగ్య అధికారులు రిలీజ్ చేశారు.
సుమారు 70 వేల కేసుల రిపోర్ట్‌ను వెల్లడించారు. కరోనా వ్యాప్తి తర్వాత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద స్టడీ ఇది. అయితే దాదాపు 80 శాతం కేసుల్లో తీవ్రత స్వల్పంగా ఉన్నట్లు సీసీడీసీ డేటా పేర్కొన్నది.
ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుమళ్లిన వాళ్లు మాత్రమే కోవిడ్‌19 వల్ల ఎక్కువగా చనిపోతున్నట్లు చైనా ఆరోగ్య సంస్థ చెప్పింది.
మెడికల్ సిబ్బందికి కూడా వైరస్ వల్ల పెను ప్రమాదం ఉన్నట్లు రిపోర్ట్ అంచనా వేసింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana