న్యూ ఢిల్లీ: కొవిడ్ నేపథ్యంలో వెనుకబడ్డ క్రీడారంగాన్ని మళ్లీ అభివృద్ధి బాటపట్టించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి కిరెన్ రిజిజు దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయన మంగళవారం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా మంత్రులు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా క్రీడలు, యువతకు సంబంధించిన కార్యకలాపాల ప్రారంభానికి రోడ్మ్యాప్ను తయారుచేయాలని ఆదేశించారు.
జూలై 14, 15వ తేదీల్లో రెండు రోజుల వీడియో కాన్ఫరెన్స్లో రిజిజు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువజన వ్యవహారాలు, క్రీడా శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రులతో సమావేశమవుతారని గతంలో ప్రకటించారు.
దేశవ్యాప్తంగా అట్టడుగుస్థాయి నుంచి క్రీడా అభివృద్ధికి, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్వైకేఎస్), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కార్యకలాపాలకు రోడ్మ్యాప్ను రూపొందించాలని ఈ సమావేశ లక్ష్యంగా నిర్వహించారు. అలాగే, కొవిడ్ 19 సమయంలో తీసుకున్న చర్యలపై సమీక్షించడంతోపాటు రాష్ట్రస్థాయిలో క్రీడా కార్యకలాపాలను పునఃప్రారంభించడం, రాష్ట్రాలు, యూటీల్లో బ్లాక్, జిల్లా స్థాయిల్లో పోటీల ద్వారా వర్ధమాన క్రీడా ప్రతిభను గుర్తించడంపై చర్చించనున్నారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాల్లో భాగంగా ఫిట్నెస్, క్రీడలను చేర్చడంపై ఇందులో నిర్ణయం తీసుకుంటారు. 2028లో ఒలింపిక్ పోడియంలో టాప్ 10 దేశాల్లో చోటు దక్కించుకోవాలంటే దేశంలో క్రీడలను అట్టడుగుస్థాయిలో బలోపేతం చేయడం చాలా కీలకమని రిజిజు నొక్కిచెప్పారు. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (కేఐఎస్సీఈ)ని అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని రిజిజు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

