Kris Srikkanth : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆటకోసం నిరీక్షించిన అభిమానులకు నిరాశే మిగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో ధోనీ ఆడుతాడనే ఆశ కూడా ఆవిరైంది.
అయితే.. సీజన్ ఆసాంతం మహా భాయ్ ఫిట్నెస్పై, ‘ఇదుగో వస్తుండు.. వచ్చే మ్యాచ్లో ఆడే అవకాశముంది’ అని అభిమానులను మభ్యపెట్టిన సీఎస్కే యామజమాన్యంపై మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్(Kris Srikkanth) మండిపడ్డాడు. పంతొమ్మిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ స్కామ్కు తెర తీసిందని ఆయన తీవ్రంగా విమర్శించాడు.
లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ ఆడలేదు. గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ త్వరలోనే ఫిట్నెస్ సాధిస్తాడని, లీగ్ దశ చివర్లో ఆడుతాడని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, కోచ్ చెప్పిన మాటలన్నీ అబద్దాలని అభిమానులు గ్రహించారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ ‘ధోనీ స్కామ్’కు సీఎస్కే తెర తీసిందని విమర్శించాడు.
‘సీజన్ ఆరంభం నుంచి ధోనీ గురించి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్లు ప్రతిసారి అబద్ధాలు చెబుతూ వచ్చారు. మొదట కాలి గాయంతో ధోనీ బాధ పడుతున్నాడని, అతడు త్వరలోనే జట్టుతో కలవాలని కోరుకుంటున్నామని చెప్పారు. ధోనీ తర్వాతి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని చెపాక్లో చివరి మ్యాచ్ టాస్ సందర్భంగా గైక్వాడ్ తెలిపాడు. ఆ మ్యాచ్కు ముందు నెట్స్లో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సీఎస్కే తమ ఎక్స్ ఖాతాలో పెట్టింది. దాంతో, తాలా కచ్చితంగా సన్రైజర్స్తో ఆడుతాడని అభిమానులు గంపెడు ఆశలతో మైదానానికి పోటెత్తారు. కానీ, మళ్లీ వారికి నిరాశే మిగిలింది’ అని శ్రీకాంత్ యూట్యూబ్ ఛానెల్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నిజాలు చెప్పాల్సింది
నిజానికి ధోనీని ఎవరూ మిస్ అవ్వడం లేదని పేర్కొన్న శ్రీకాంత్ దిగ్గజ ఆటగాడి గురించి సరైన సమాచారం ఇవ్వాల్సిన యాజమాన్యం అభిమానుల మనోభావాలతో ఆడుకుందని విమర్శించాడు. ‘నిజం చెప్పాలంటే ధోనీని ఎవరూ మిస్ కావడం లేదు. ధోనీని ఆడించాలని ఎవరూ కోరడం లేదు. ఎందుకంటే ఐపీఎల్లో ధోనీ శకం ముగిసింది.
ఐపీఎల్ దిగ్గజ ఆటగాళ్లలో ధోనీ ఒకడు. గొప్ప కెప్టెన్ కూడా. కాబట్టి.. చెన్నై యాజమాన్యం అతడి గురించి నిజాలు చెప్పాల్సింది. కానీ, సీజన్ ఆసాంతం ఇదుగో వస్తున్నాడు అంటూ సీఎస్కే ఫ్రాంచైజీ కోట్లాది మంది అభిమానులను పిచ్చొళ్లను చేసింది’ అని శ్రీకాంత్ అసహనంతో రగిలిపోయాడు.

