Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR | కుళ్ళిన వ్యవస్థలపై దేశ భవిష్యత్తును నిర్మించలేం.. సీబీఎస్ఈ ఫలితాల వివాదంపై కేటీఆర్ ఆగ్రహాం!

KTR | కుళ్ళిన వ్యవస్థలపై దేశ భవిష్యత్తును నిర్మించలేం.. సీబీఎస్ఈ ఫలితాల వివాదంపై కేటీఆర్ ఆగ్రహాం!

KTR Slams CBSE Board | దేశంలో నీట్ (NEET) పరీక్షల అక్రమాలపై రేగిన వివాదం ఇంకా చల్లబడకముందే, భారతీయ విద్యా వ్యవస్థ ప్రతిష్టను మరింత మసకబారుస్తూ సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి ఫలితాల వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవలే విడుదలైన సీబీఎస్ఈ ఫలితాలలో డిజిటల్ మూల్యాంకనం (On-Screen Marking) లోపాల కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ మార్కుల తారుమారు వ్యవహారం దేశవ్యాప్తంగా దాదాపు 18.5 లక్షల మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయం కోసం ఉధృతంగా పోరాడుతున్న విద్యార్థులకు తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ.. దేశ భవిష్యత్తును ఇలాంటి కుళ్ళిన, అసమర్థ వ్యవస్థల మీద ఎంతమాత్రం నిర్మించలేమని హెచ్చరించారు.

ఈ మొత్తం వ్యవహారంలో గతంలో తెలంగాణను కుదిపేసిన ఒక చేదు జ్ఞాపకం మళ్లీ తెరపైకి వచ్చిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను అస్తవ్యస్తం చేసి, పలువురు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ‘గ్లోబరేనా’ (Globarena) సంస్థే ఇప్పుడు కేవలం తన పేరును (coempt) మార్చుకుని, సీబీఎస్ఈ నుంచి అంతకంటే పెద్ద కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. కేంద్ర బోర్డు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద గందరగోళం నెలకొందని విమర్శించారు. నాడు గ్లోబరేనా వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించిందని కేటీఆర్ గుర్తుచేశారు. లోపాలను వెలికితీసేందుకు తక్షణమే ముగ్గురు నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తప్పు చేసిన సంబంధిత అధికారులను పదవుల నుంచి తక్షణమే తొలగించామని కేటీఆర్ వివరించారు. అంతేకాకుండా, బాధ్యురాలైన సదరు సంస్థపై కోర్టులో చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకున్నామని ప్రస్తావించారు.

ఇంతటి చెడ్డ పేరు ఉన్న ఒక అసమర్థ సంస్థను సీబీఎస్ఈ బోర్డు ఎలా నమ్మిందని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం ఆ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే బోర్డు తన నిబంధనలను పదే పదే మార్చిందని ఆయన ఆరోపించారు. ఒక చిన్న పేరు మార్పు ప్రక్రియతో పాత తప్పులను దాచిపెట్టి, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో, భవిష్యత్తుతో ఆడుకోవడం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. నిరుద్యోగం, పరీక్షల లీకేజీలు, తప్పుడు మూల్యాంకనాలతో దేశంలోని విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని, లక్షలాది మంది మానసిక క్షోభకు కారణమైన ఈ మార్కుల వివాదానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి కచ్చితంగా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. బాధితులైన విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana