న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. మరో వైపు విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో ఇవాళ ఉదయం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
జూలై 20వ తేదీన విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ గురించి వివరణ ఇవ్వాలని, కేంద్ర మంత్రి అమిత్ షా సభకు రావాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. గందరగోళం మధ్య సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. కేంద్ర మంత్రులు, సభ్యులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లును, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లును ఆర్ఎస్పీ నేత ఎన్కే ప్రేమచంద్రన్ వ్యతిరేకించారు. ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు. కేరళ పేరు మార్పు బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును మంత్రి మురళీధర్ మోహల్ ప్రవేశపెట్టారు.
ఇవాళ ఉదయం సభ సమావేశం కాగానే, కేవలం కొన్ని సెకన్లలోనే వాయిదా వేశారు. ప్రేమచంద్రన్ ఆ సమయంలో చైర్లో ఉన్నారు. ఆయన తొలుత సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. సాధారణంగా క్వశ్చన్ అవర్ సమయంలో స్పీకర్ ఓం బిర్లా చైర్లో ఉంటారు. కానీ ఇవాళ ఆయన సభకు రాలేదు. అయితే సభను సజావుగా నడిపించేందుకు ఆయన విపక్ష నేతలతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి లోక్సభ కార్యక్రమాలు ప్రతి రోజూ వాయిదాపడుతూనే ఉన్నాయి. 8 బిల్లులు ప్రవేశపెట్టగా దాంట్లో 6 బిల్లులు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి.

